
మహిళల మాన ప్రాణాలకు రక్షణ కల్పించలేరా?
అనంతపురం కార్పొరేషన్: ‘బిహార్లోని చంబర్ లోయకంటే కూడా ఏపీలో మహిళలపై అత్యాచారాలు పెచ్చుమీరాయి. మహిళలు, యువతుల మాన ప్రాణాలకు రక్షణ కల్పించలేని నిస్సహాయ స్థితిలో పోలీసు శాఖ ఉంది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. సోమవారం నగరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు, బాలికలు, చిన్నారులకు రక్షణ కల్పించకపోతే వైఎస్సార్ సీపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. సోషల్ మీడియాలో యువత ఏదైనా పోస్టులు పెడితేనే చర్యలు తీసుకునే పోలీసులు.. మహిళల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదన్నారు.
పోలీసుల నిర్లక్ష్యంతోనే దారుణ హత్య..
అనంతపురంలోని రామకృష్ణ కాలనీకి చెందిన తన్మయి తప్పిపోయిందని ఈ నెల 3న బాధిత తల్లిదండ్రులు వన్టౌన్ పోలీసులను ఆశ్రయిస్తే వారు పట్టించుకోలేదన్నారు. ఈ క్రమంలోనే ఐదు రోజుల తర్వాత తన్మయి శవమై తేలిందన్నారు. పోలీసుల అలసత్వం కారణంగానే యువతి దారుణ హత్యకు గురైందని తెలిపారు. బాధిత యువతి తల్లిదండ్రులు అనుమానితుడి పేరు చెప్పినా అరెస్టు చేయకుండా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారన్నారు. రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో అధికార పార్టీకి చెందిన వారి ప్రమేయంతోనే బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని, దీనిపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం కావడంతో, దీన్ని ఆసరాగా తీసుకున్న మృగాళ్లు నిత్యం ఏదో ఒక చోట మహిళలు, బాలికలు, యువతులపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఏడాది కూటమి పాలనలో 188 అత్యాచార ఘటనలతో పాటు 15 మంది హత్యలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
మిస్సింగ్లపై మాట్లాడండి పవన్..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడో తెలంగాణాలో అత్యాచారం జరిగితే ఏపీలో అటువంటి పరిస్థితులు తలెత్తకూడదని ‘దిశ’ పోలీసు స్టేషన్, యాప్ను ప్రవేశపెట్టి మహిళలకు అండగా నిలిచారని ‘అనంత’ గుర్తు చేశారు. అప్పట్లో పవన్ కల్యాణ్, చంద్రబాబు రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని నానా యాగీ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కేవలం అనంతపురం జిల్లాలోనే 72 మంది మిస్ అయ్యారని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీనిపై మాట్లాడాలని సూచించారు.
ఆదాయాలకు జీ హుజూర్..
ఆదాయం తెచ్చిపెట్టే సెటిల్మెంట్లకు పోలీసులు జీ హుజూర్ అంటున్నారని ‘అనంత’ విమర్శించారు. జిల్లాలో ఎస్పీ, డీఎస్పీలు చెబితే వినే స్థితిలో సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు లేరని, ప్రజాప్రతినిధులే బాస్లన్న ధోరణితో నడుచుకుంటున్నారని దుయ్యబట్టారు. మేయర్ వసీం చాంబర్లో దౌర్జన్యం, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి చింతకుంట మధుపై దాడి, సచివాలయ ఉద్యోగిపై దాడిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు స్పందించడం లేదని, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా కేసు నమోదు చేయకపోతే ఎలాగని ప్రశ్నించారు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు ఐదేళ్లకోసారి మారతారని, డీజీపీ మరికొన్ని నెలల్లో పదవీ విరమణ పొందుతారని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఆయన హితవు పలికారు.
మంత్రి బంధువులకే దిక్కులేదు..
ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ‘అనంత’ నగరంలో కూటమి ప్రజాప్రతినిధుల నిర్వాకంతో ఆందోళనకర వాతావరణం నెలకొందన్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి భరత్ బంధువులైన శ్రీనివాస్గుప్తా, వెంకటేష్ గుప్తాల స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని సాక్షాత్తు బాధితులే చెప్పారన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధి, మరో నాయకుడు ఇద్దరూ నేర చరిత్ర కల్గిన వారని, ఎవరికి వారు కింగ్ మేకర్లుగా మారాలనుకుని ఫిర్యాదులు చేసుకున్నారన్నారు. విచ్చలవిడిగా మట్కా, ఎంఆర్పీ కంటే అధికంగా మద్యం విక్రయాలు, భూ దందాల ఘటనలు ఎక్కువయ్యాయన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు, నాయకులు నార్పల సత్యనారాయణ రెడ్డి, మల్లెల వేణు, చామలూరు రాజగోపాల్, కార్పొరేటర్ శేఖర్బాబు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపాటు