సింహాచలం: తొలి ఏకాదశి సందర్భంగా వరాహ లక్ష్మీనృసింహస్వామికి శనివారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటలకు సహస్ర నామార్చనని విశేషంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ బేడా మండపంలో వేదికపై అధిష్టింపజేసి, 1001 నామాలతో సహస్రనామార్చన చేశారు.
●శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామికి ఉదయం 9.30 గంటల నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ బేడా మంపడంలో స్వామివారి ఉత్సవమూర్తులను అధిష్టింపజేసి, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణం కమనీయంగా సాగింది. ఉభయ దాతలకు కల్యాణ అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు.
●వరాహ లక్ష్మీనృసింహస్వామికి గరుడ సేవ కూడా ఘనంగా జరిగింది. ఆలయ బేడా మండపంలో వెండి గరుడ వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉంచి అష్టోత్తరశత నామావళి పూజ చేశారు.
పరవాడ: తొలి ఏకాదశి సందర్భంగారావాడ దరి జల్లెలపాలెంలో కొలువుదీరిన మరిడిమాంబ ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వెంకటాద్రిపై ఏకాదశి ప్రత్యేక పూజలు
పెందుర్తి: తొలి ఏకాదశి సందర్భంగా స్థానిక వెంకటాద్రిపై కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు మహర్తి రామానుజాచార్యులు ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ, అష్టోత్తర పూజలు చేశారు. భక్తులు తులాభారం సమర్పించారు. దాదాపు 10 వేల మంది భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. స్వామిని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు, వెస్ట్ జోన్ ఏసీపీ పెడాడ ప్రదీప్తి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్(ఎస్ఈసీ) కోడిగుడ్ల దేవిసాంబ దర్శించుకున్నారు. పెందుర్తి సాధుమఠం వద్ద ఉన్న రమా సత్యనారాయణస్వామి ఆలయంలో ప్రధానార్చకుడు మురళీకృష్ణశర్మ, రాజ ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.


