జిల్లా సమస్యలపై మౌనం
అనకాపల్లి: ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్రెడ్డి పాలనలో అప్పటి ఎమ్మెల్యే (ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యే) కొణతాల రామకృష్ణకు మూడు మంత్రి పదవులు ఇచ్చి ఉత్తరాంధ్ర జిల్లాకే పెద్ద దిక్కుగా చేసిన ఘనత మర్చిపోయి రాజశేఖర్రెడ్డి కుమారుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని గొడ్డలిపార్టీ అని సంభోదించడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. స్థానిక రింగ్రోడ్డు పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రెండు రోజుల క్రితం కశింకోట మండలం ఉగ్గినపాలెం గ్రామంలో జరిగిన ఒక సమావేశంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తన స్థాయిని దిగజారి మాట్లాడడంతో నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో అనకాపల్లి నియోజకవర్గ సమస్యలపై మాట్లాడ కూడా సీఎం చంద్రబాబు నాయుడు మనవడు గురించి సంభోదిస్తూ మాట్లాడడం చూస్తే మంత్రి పదవికోసం పాకులాడుతున్నట్టు తెలుస్తుందన్నారు. హెరిటేజ్ లాభాలు రానున్న రోజుల్లో బాగా పెరుగుతాయని ఎమ్మెల్యే మాట్లాడడం చూస్తుంటే త్వరలో హెరిటేజ్ అమ్మకాలు తనే (కొణతాల రామకృష్ణ) చేస్తున్నట్లు తెలుస్తుందన్నారు. దివంగత రాజశేఖర్రెడ్డి మరణానానంతరం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కొణతాల రామకృష్ణకు ఎంతో గౌరవం ఇచ్చారని, అనకాపల్లిలో నేటి వరకూ ఎమ్మెల్యేలుగా పనిచేసిన దాడి వీరభద్రరావు, గుడివాడ అమర్నాథ్, గంటా శ్రీనివాసరావు తమస్థాయికి తగ్గట్టుగా మాట్లాడేవారని అన్నారు. కొణతాల రామకృష్ణకు సీటు ఇప్పించిన జనసేన అధినేత పవన్కల్యాణ్ గురించి మాట్లాడకూడా టీడీపీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి ఎక్కువగా పొగడ్తలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీ సమావేశంలో సూపర్సిక్స్ పథకాలు కోసం, నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ కోసం మాట్లాడితే బాగుటుందన్నారు. కాంగ్రెస్పార్టీలో ఉత్తరాంధ్ర జిల్లాలో ద్రోణంరాజు సత్యనారాయణ వంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నప్పటికీ 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కొణతాల రామకృష్ణను అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి గెలిపించుకుని, మూడు మంత్రి పదవులు ఇచ్చిన రోజును ఒక్కసారి రామకృష్ణ గుర్తుచేసుకోవాలన్నారు. నియోజకవర్గంలో సుమారుగా రూ.50 కోట్ల ప్రభుత్వ స్థలాన్ని కాజేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, మండలంలో అన్ని గ్రామాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్పై ఎమ్మెల్యే దృష్టి పెడితే బాగుంటుందన్నారు. వ్యక్తిగత విమర్శలకు దిగజారడం రామకృష్ణకు తగదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.


