ఆర్డీవో వి.వి.రమణ
నర్సీపట్నం: ‘సర్’ కార్యక్రమానికి ఓటర్లు సహకరించాలని ఆర్డీవో వి.వి.రమణ తెలిపారు. బుధవారం ఆయన నర్సీపట్నంలో విలేకర్లతో మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాల సవరణ(సర్) ముమ్మరంగా జరుగుతోందని చెప్పారు. 2002 ఓటర్ల జాబితాకు మ్యాపింగ్ చేసేందుకు బూత్ లెవెల్ అధికారి కోరే వివరాలు అందించాలన్నారు. ఓటరు ఫారాలు నింపి బీఎల్వోలకు ఇవ్వకపోతే ఓటరు లేనట్లుగా గుర్తించి జాబితా నుంచి పేర్ల తొలగించనున్నట్టు చెప్పారు. ఈ నెల 14వ తేదీతో సమయం ముగిస్తున్నందున ఓటర్లు బీఎల్వోలకు సహకరించి ఫారాలు నింపి అందించాలని ఆర్డీవో సూచించారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
గొలుగొండ: సర్ కార్యక్రమంపై బీఎల్వోలు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆర్డీవో రమణ తెలిపారు. గొలుగొండ తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏటిగైరం, రవాణాపల్లి, కొమిర ప్రాంతాల్లో బీఎల్వోల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 76.7 శాతం ‘సర్’ పూర్తి అయిందన్నారు. గొలుగొండ మండలంలో 78 శాతం, నాతవరం మండలంలో 79 శాతం, నర్సీపట్నం మండలంలో 72 శాతం, మాకవరపాలెం మండలంలో 80 శాతం పూర్తయిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వి. శ్రీనివాసరావు, ఎంపీడీవో శ్రీనివాసరావు, రీ సర్వే డీటీ కొండబాబు పాల్గొన్నారు.


