చోడవరం : పట్టణంలో మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఖాళీ బిందెలతో మహిళళలు నిరసన తెలిపారు. చోడవరం పట్టణంలో యడ్లవీధి, చందకవీధితోపాటు పలు ప్రాంతాల్లో మంచినీటి సమస్య తలెత్తింది. పంచాయతీ కొళాయిల ద్వారా మురికి నీరు వస్తుండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు మంచినీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆయా ప్రాంతాల మహిళలు కొందరు పంచాయతీ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. వీరికి సీపీఐ నాయకుడు రెడ్డిపల్లి అప్పలరాజు మద్దతు పలికారు. పంచాయతీ నిర్లక్ష్యంతో ప్రజలకు పూర్తి స్థాయిలో మంచినీరు సరఫరా కావడం లేదని, వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. మంచినీటి ట్యాంక్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయడంలేదని, కుళాయి పైపులైన్లు కొన్నిచోట్ల మురుగు కాల్వల మార్గంలో ఉండడం వల్ల పైపులు లీకేజీ అయ్యి వాటిలో బురదనీరు వెళ్లి కుళాయిల ద్వారా వచ్చే తాగునీరు కలుషితమైపోతుందని బాధిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మంచినీటి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ ఆందోళనలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శన చేసి పంచాయతీ అధికారులకు వినతిపత్రం అందజేశారు.


