ఏయూక్యాంపస్: కుటుంబ సమస్యల కారణంగా మనస్తాపానికి గురై సముద్రంలో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఇద్దరు మహిళలను జీవీఎంసీ గజ ఈతగాళ్లు, పోలీసులు సమయస్ఫూర్తితో రక్షించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... కంచరపాలెం ప్రాంతానికి చెందిన జి. సత్యవతి, డి.లక్ష్మి అనే ఇద్దరు మహిళలు గురువారం మధ్యాహ్నం రామకృష్ణ బీచ్కు చేరుకున్నారు. కుటుంబ సమస్యలతో వేర్వేరుగా ఇక్కడికి వచ్చిన వీరిద్దరూ.. జీవితంపై విరక్తి చెంది సముద్రంలో మునిగి చనిపోవాలనే ఉద్దేశంతో లోపలికి వెళ్లారు. సముద్రం లోపలకు వారు వెళ్తుండటాన్ని గమనించిన జీవీఎంసీ గజ ఈతగాళ్లు మురళి, కిషోర్లు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రాణాలకు తెగించి సముద్రంలోకి దూకి, మునిగిపోతున్న ఆ ఇద్దరు మహిళలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు సదరు మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి, వారి కు టుంబ సభ్యులను పిలిపించి సురక్షితంగా అప్పగించారు. సమయానికి స్పందించి ఇద్దరి ప్రాణా లు కాపాడిన గజ ఈతగాళ్లను, పోలీసులను పలువురు అభినందించారు.


