ఏలేరు కాలువకు భారీ గండి
మాకవరపాలెం : ఏలేరు కాలువకు భారీ గండి పడింది. విశాఖ స్టీల్ప్లాంట్, నగర ప్రజల తాగునీటి అవసరాలకు నీటిని సరఫరా చేసే ఏలేరు కాలువకు మండలంలోని రాచపల్లి సమీపంలోని 100 వ కిలోమీటరు సమీపంలో గురువారం సాయంత్రం గండి పడింది. దీంతో గండి ప్రాంతం పక్కనే ఉన్న యూటీ(అండర్ టన్నెల్) వద్ద 20 అడుగులకుపైగా గట్టు కోతకు గురైంది. ఈ నేపథ్యంలో కాలువ నుంచి నీరంతా పక్కనే ఉన్న గెడ్డద్వారా వృధాగా పోతోంది. ఈ గండి కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లలేదు. కాగా చీకటి పడే సమయంలో గండి పడడంతో పూడ్చివేత పనులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ గండి కారణంగా సుమారు 150 ఎంజీడీల నీరు వృధా అయ్యే అవకాశం ఉంది. గండిపడిన ప్రాంతాన్ని ఎస్ఐ దామోదర్నాయుడు పరిశీలించారు. ఏలేరు కాలువ సిబ్బందితో మాట్లాడి పూడ్చివేత పనులపై వివరాలు తెలుసుకున్నారు.


