టీడీఆర్...
రెండు నియోజకవర్గాలు..
1225 మంది నిర్వాసితులు..
అనకాపల్లి–అచ్యుతాపురం రోడ్డు విస్తరణలో రెండు నియోజకవర్గాల పరిధిలో అనకాపల్లి, మునగపాక, రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల పరిధిలో 125 ఎకరాల రైతుల స్థలం ప్రభుత్వం సేకరించింది. దాదాపుగా నాలుగు మండలాల పరిధిలో 1225 మంది నిర్వాసితులున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దేవుడి మాన్యంలో ఉన్న 12 మంది నిర్వాసితులకు, అర్అం డ్ బీ స్థలంలో పీడబ్ల్యూ స్థలంలో ఉన్న 62 మంది నిర్వాసితులకు బలవంతంగా టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. మిగిలిన నిర్వాసితులెవ్వరూ టీడీఆర్ బాండ్లు తీసుకోకుండా వ్యతిరేకించారు.
సాక్షి, అనకాపల్లి : చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి అనకాపల్లి– అచ్యుతాపురం రోడ్డు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా టీడీఆర్ బాండ్లు తీసుకోవాలంటూ ప్రభుత్వం ఒత్తిడి చేస్తూ వస్తుంది. స్థానిక కూటమి ప్రజాప్రతినిధి అయితే నిర్వాసితులను టీడీఆర్ బాండ్లు తీసుకోవాలంటూ భయపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇటీవల నాలుగు నెలల క్రితం తమ డిమాండ్లు నెరవేర్చాలని విశాఖలో గల వీఎంఆర్డీఏ కార్యాలయం వద్ద ‘అనకాపల్లి– అచ్యుతాపురం’ నిర్వాసితులు నిరసన కూడా చేశారు. ఇళ్లు, దుకాణాలు, భూములకు ఒకేసారి నష్టపరిహారం చెల్లించాలని, ఆ నష్టపరిహారం టీడీఆర్ బాండ్ల రూపంలో కాకుండా నగదు రూపంలోనే అందించాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. గతంలో నిర్వహించిన గ్రామ సభల్లో టీడీఆర్ బాండ్లు వద్దని నిర్వాసితులంతా ముక్తకంఠంతో వ్యతిరేకించినా నాడు నిర్వాసితులకు టీడీఆర్ బాండ్లే ఇస్తామని అధికారులు ఇబ్బందులకు గురిచేశారు. అయితే బాండ్లు వద్దే వద్దు..నగదు రూపంలోనే నష్టపరిహారం చెల్లించాలని, తమకు పునరావాసం కల్పించాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. అలాగే ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారులకు పరిహారం ఇవ్వడంతోపాటు ప్రభుత్వమే ఉపాధి కల్పించాలని, 100 అడుగుల తర్వాత నిర్మించుకొనే ఇళ్లకు ఎటువంటి నిబంధనలు పెట్టరాదని డిమాండ్ చేస్తున్నారు.
భయపెట్టిన కూటమి ప్రభుత్వం..
అనకాపల్లి– అచ్యుతాపురం రోడ్డు విస్తరణలో స్థలాలు, భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారంగా నగదు బదులు ట్రాన్స్ఫర్బుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) బాండ్లు తీసుకోవాలని నిర్వాసితులను కూటమి ప్రభుత్వం భయపెడుతూ వచ్చింది. బాండ్లు వద్దని, నగదు మాత్రమే ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నా...అధికారులు నియంత్రత్వ పోకడతో ముందుకు సాగుతున్నారు. వాస్తవానికి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నగదు రూపంలో నష్ట పరిహారం అందిస్తామని రైతుల నుంచి రోడ్డు విస్తరణకు భూములు తీసుకుంది. ఆనాడు గ్రామ సభల్లో నష్టపరిహారంగా నగదు ఇవ్వడానికి అంగీకారం తెలిపింది. ఈ లోగా ప్రభుత్వం మారింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రెవెన్యూ అధికారులు గ్రామాల్లో సభలు నిర్వహించి..టీడీఆర్ బాండ్లకు భవిష్యత్తులో లభించే డిమాండ్ గురించి వివరించారు.
అప్పుడే నిర్వాసితులు టీడీఆర్ బాండ్లు వ్యతిరేకించారు. మళ్లీ మూడు రోజుల క్రితం అనకాపల్లి– అచ్యుతాపురం రోడ్డు విస్తరణలో నిర్వాసితులకు టీడీఆర్ బాండ్లు ఇవ్వాలంటూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది
నిరసనలు, పాదయాత్ర..
●‘అనకాపల్లి–అచ్యుతాపురం’ రోడ్డు విస్తరణ నిర్వాసితులకు అండగా వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో 2025లో జనవరి నెలలో నిర్వాసితులతో కలిసి అచ్యుతాపురం నుంచి అనకాపల్లి కలెక్టర్ కార్యాలయం వరకూ పాదయాత్ర చేశారు.
●మునగపాకలో ఫిబ్రవరి 24, 25వ తేదీల్లో వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వాసితులకు 48 గంటల దీక్ష చేశారు.
●అనకాపల్లి, అచ్యుతాపురం, మునగపాక, రాంబిల్లి పలు గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
భూసేకరణ చట్టం కింద భూమి తీసుకున్నప్పుడు చట్ట ప్రకారమే చెల్లించాల్సిన పరిహారాన్ని ఇవ్వకుండా టీడీఆర్ బాండ్లు తీసుకోవాలని బలవంతం చేయడానికి వీల్లేదంటూ ఇచ్చిన హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిది. బాండ్లు ఐచ్ఛికమే తప్ప..తప్పనిసరి కాదు..బాధితులు ఆ బాండ్లను తిరస్కరించే అధికారం ఉంది. నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చిన విషయం విదితమే. జిల్లాలో ‘అనకాపల్లి–అచ్యుతాపురం’ రోడ్డు నిర్వాసితులకు హైకోర్టు తీర్పు ఊరటగా మారింది.
‘అనకాపల్లి– అచ్యుతాపురం’ రోడ్డు నిర్వాసితులకు ఊరట
టీడీఆర్ బాండ్లు తీసుకోవాలని బలవంతం చేయొద్దు
బాండ్లు ఐచ్ఛికమే తప్ప..తప్పనిసరి కాదు
బాధితులకు ఆ బాండ్లను తిరస్కరించే అధికారం ఉంది
టీడీఆర్ బాండ్లపై హైకోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం
అనకాపల్లి, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో 1225 మంది నిర్వాసితులు
రోడ్డు విస్తరణకు రైతుల నుంచి 125 ఎకరాల స్థల సేకరణ
నగదు రూపంలోనే పరిహారం చెల్లించాలని కోరుతున్న నిర్వాసితులు


