జీలకర్రబెల్లం ఘట్టం నిర్వహిస్తున్న అర్చకులు
సింహాచలం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో మంగళవారం నుంచి ఆర్జిత సేవలు పునరుద్ధరించారు. స్వామివారి వార్షిక కల్యాణ మహోత్సవాల సందర్భంగా గత నెల 28 నుంచి ఈ నెల 13 వరకు ఆర్జిత సేవలన్నీ నిలిపివేసిన విషయం తెలిసిందే. తిరిగి మంగళవారం నుంచి యథావిధిగా ఆర్జిత సేవలను పునరుద్ధరించారు. దీనిలో భాగంగా ఉదయం స్వామివారికి సహస్రనామార్చన ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణమండపంలో వేదికపై వేంజేపచేశారు. 1001 నామాలతో అర్చన జరిపి, విశేష హారతులు అందించారు.
విశేషంగా నిత్యకల్యాణం
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం విశేషంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణమండపంలో వేదికపై వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఉభయ దాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు.
శాస్త్రోక్తంగా గరుడసేవ
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి మంగళవారం గరుడసేవ శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని గరుడ వాహనంపై వేంజేపచేశారు. అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. భక్తులను గరుడ వాహనం చుట్టూ ప్రదక్షిణ చేయించారు.


