పెందుర్తి: ఓ ఆర్మీ అధికారి భార్య నిజాయితీని చాటుకున్నారు. రోడ్డుపై పడి ఉన్న దాదాపు రూ.2.5లక్షల విలువైన బంగారు ఆభరణాన్ని పోలీసులకు అప్పగించారు. వివరాలివి.. వేపగుంట అప్పలనర్శయ్యకాలనీలో నివాసం ఉంటున్న సిరిగుడి వరలక్ష్మి ఆదివారం సాయంత్రం తన బ్యాగ్లో బంగారు నక్లెస్ పెట్టుకుని కుమార్తెతో కలిసి గోపాలపట్నంలోని స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చేందుకు ఆటో ఎక్కి నాయుడుతోటలో దిగింది. నడుచుకుంటూ ఇంటికి వెళ్లింది. అయితే ఇంటికి వెళ్లి బ్యాగ్ చూడగా అందులో ఆభరణం లేదు. వెంటనే బాధితురాలు వరలక్ష్మి పెందుర్తి క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో ఉన్నాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐ డి.సూరిబాబు ఆధ్వర్యంలో మూడు బృందాలు గాలింపు చేపట్టాయి.
నాకు బంగారం దొరికింది
రెండు రోజులుగా ఆభరణం కోసం సాంకేతిక పరిజ్ఞానంతో గాలింపు చేపట్టిన పోలీసులకు ఆచూకీ దొరకలేదు. అయితే మంగళవారం ఉదయం పద్మనాభనగర్కు చెందిన ఆర్మీ అధికారి కట్టా శ్రీనివాసరావు భార్య శ్రావణి తాను వాకింగ్ చేస్తున్న సమయంలో నాయుడుతోట వద్ద ఆభరణం దొరికిందని పోలీస్ స్టేషన్కు వచ్చి నక్లెస్ను అప్పగించారు. దీంతో పోలీసులు బాధితురాలు వరలక్ష్మిని పిలిపించి ఆభరణం సరిపోల్చారు. ఆమెకు ఎస్ఐ సూరిబాబు ఆభరణాన్ని అప్పగించారు. నిజాయితీ ప్రదర్శించిన కట్టా శ్రావణిని పోలీసులు ప్రత్యేకంగా అభినందించారు.
రోడ్డుపై దొరికిన బంగారు ఆభరణం పోలీసులకు అప్పగింత


