కశింకోట : దాదాపు ఏడేళ్లుగా గంజాయి కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని సుదూర ప్రాంతానికి వెళ్లి వెతికి మరీ పట్టుకొని కశింకోట పోలీసులు అరెస్టు చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నాన్ బెయిల్బుల్ వారెంట్ను కోర్టు ఆదేశాల మేరకు అమలు చేయడంలో భాగంగా గంజాయి కేసులో కోర్టుకు హాజరు కాకుండా పరారీలో ఉన్న లారీ డైవర్ను ఎట్టకేలకు పట్టుకొని అరెస్టు చేసినట్టు ఎస్ఐ లక్ష్మణరావు మంగళవారం తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా దల్బెలున్ గ్రామానికి చెందిన డెబాసిస్ ఘెరాయ్ (26) కశింకోట వద్ద ట్రాలీపై మరమ్మతుకు తరలిస్తున్న కారుగా భ్రమింపజేసి దానిలో 2019లో గంజాయి తరలిస్తున్న కేసులో నిందితుడన్నారు. అప్పటి నుంచి కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు అతనిపై నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ చేసిందన్నారు. ఈ మేరకు కోర్టు జారీచేసిన ఉత్తర్వులను అమలు చేయడంలో భాగంగా నిందితుడిని గ్రామానికి తమ సిబ్బందితో పాటు వెళ్లి పట్టుకొని అరెస్టు చేసి అక్కడి కోర్టులో హాజరు పరిచామన్నారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్ పొందిన తర్వాత అనకాపల్లి కోర్టులో నిందితుడిని హాజరు పరిచామన్నారు.


