అనకాపల్లి: ప్రజల ఆరోగ్యంతో చంద్రబాబు ప్రభుత్వం చలగాటం అడుతుందని, కాలుష్యాన్ని వెదజల్లే బొగ్గు కంపెనీలను తక్షణమే తొలగించాలని, ఇప్పటికే గ్రామంలో సుమారుగా నలుగురు బొగ్గు కాలుష్యం కారణంగా మృత్యవాత పడ్డారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ అన్నారు. పిసినికాడ రెవెన్యూ పరిధిలో బీఆర్టీ కాలనీలో అనహిత రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్(బొగ్గు కంపెనీ–1,2)ని తక్షణమే తొలగించాలని, బీఆర్టీ కాలనీ, సంపతిపురం, వెటజంగాలపాలెం గ్రామాల ప్రజలు సోమవారం కంపెనీ వద్ద ధర్నా చేస్తున్న సమయంలో వైఎస్సార్సీపీ నాయకులు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్యాన్ని వెదజల్లే బొగ్గు కంపెనీల ద్వారా కిడ్నీ, లీవర్ సమస్యతో గడిచిన మూడు, నాలుగు నెలల్లో కొంతమంది మృత్యవాత పడ్డారన్నారు. ఫ్యాక్టరీని తక్షణమే నిలుపుదల చేయాలని ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామన్నారు. పోలీస్, ఇతర శాఖల అధికారులు ఐదు రోజుల్లో కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, ఈనెల 18వ తేదీ వరకూ నిరసన కార్యక్రమాన్ని నిలుపుదల చేయడం జరుగుతుందన్నారు. లేని పక్షంలో ప్రజలు పక్షాన నిత్యం ధర్నాలో పాల్గొనడం జరుగుతుందన్నారు. ప్రజల ప్రాణాలను హరించే కంపెనీలను ప్రభుత్వం ఏర్పాటు చేయడం అన్యాయమని, తక్షణమే నిలుపుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మలసాల కుమార్రాజా, మండలపార్టీ అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద్, ఎంపీటీసీలు మెల్లేటి హేమ, బుద్ద నాగేష్, స్థానిక ప్రజలు ఎల్లపు వెంకట్రావు, పెదిశెట్టి రమేష్, మల్ల శ్రీనివాసరావు, భాస్కర్రావు, నీలకంఠ సంతోష్ లక్ష్మి, ఎం.పాపారావు, కాండ్రేగుల పరమేష్, మూడు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.


