మేడిచర్లకు చెందిన
దళిత యువకుడి ఆరోపణ
కె.కోటపాడు: మండలంలోని మేడిచర్ల గ్రామంలో దళిత వర్గానికి చెందిన తనపై సోమవారం గ్రామానికి చెందిన వారు దాడికి పాల్పడ్డారని బాధితుడు యల్లపు ప్రసాద్ తెలిపారు. దాడిలో గాయపడి కె.కోటపాడు ఆసుపత్రిలో వైద్యం పొందేందుకు వచ్చినట్టు ఆయన విలేకరులకు తెలిపారు. కొంత కాలంగా ప్రతి ఏడాది నిర్వహించే అంబేడ్కర్ జయంతిని ఈ ఏడాది కూడా జరిపేందుకు దళితుల కాలనీకి చెందిన వారు చర్చించుకోవడం జరిగిందని, ఇది విన్న గ్రామానికి చెందిన కొందరు నాయకులు సోమవారం తన ఇంటికి వచ్చి తనను బయటకు పిలిచి ఏంటిరా నువ్వు అంబేద్కర్ జయంతిని చేసేదని అసభ్య పదజాలంతో తిట్టారని ఆరోపించారు. తన తల్లిదండ్రులతో పాటు భార్య ఉండగానే తనపై గ్రామానికి చెందిన పూడి నారాయణమూర్తి, పూడి శేషగిరిరావు, రొంగలి కుమార్, గండేపల్లి నవీన్, పూడి అప్పలనాయుడు, బొడ్డు శ్రీనివాసరావు, పూడి రాంజీ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తన చేతులు వెనక్కి పట్టుకొని తనను చితకబాదారని వాపోయారు. తనపై జరిగిన దాడిపై ఎ.కోడూరు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.


