అనకాపల్లి : మహిళా ఉపాధ్యాయులకు ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక స్టాఫ్ రూమ్స్, మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ, ఏప్రిల్ 1న స్థానిక నెహ్రూచౌక్ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహర దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వత్సవాయి శ్రీలక్ష్మి, గొంది చిన్నబ్బాయ్ అన్నారు. జీవీఎంసీ విలీన గ్రామమైన కె.ఎన్.ఆర్.పేటలో యూనియన్ ఆధ్వర్యంలో డీఈఓకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు పుస్తకాలు తీసుకురావడం, ప్రశ్నపత్రాలు తీసుకు రావడం లాంటి పనుల నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలన్నారు. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు తదితర సమస్యల నుంచి రక్షణార్ధం జిల్లా స్థాయిలో ఒక ప్రొటెక్షన్ సెల్ను ఏర్పాటు చేయాలన్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి జిల్లా స్థాయిలో స్ట్రెస్ మేనేజ్మెంట్ కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలన్నారు. తల్లిదండ్రులను అత్తమామాలను చూసుకోవడానికి పది రోజులు ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని, మహిళా ఉద్యోగులకు ఉచిత న్యాయ సలహా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.


