సింహాచలం: చైత్ర శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని సింహగిరిపై వేంచేసిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరగనుంది. దేవస్థానం ఈవో జె. వెంకటరావు ఆధ్వర్యంలో అధికారులు, వైదిక వర్గాలు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయ నీలాద్రి గుమ్మం వద్ద జరిగే కొట్నాల ఉత్సవంతో వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు ధ్వజారోహణం, 6.30 గంటలకు ఉత్సవమూర్తులతో ఎదురు సన్నాహోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 8.30 గంటలకు మాడ వీధుల్లో రథోత్సవం, రాత్రి 10.30 గంటలకు ఉత్తర రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన సుందరమైన వేదికపై స్వామివారి వార్షిక కల్యాణాన్ని జరిపిస్తారు. ఈ వేడుకకు సుమారు 15 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు, వారందరికీ అన్నప్రసాదం, పంపిణీకి తలంబ్రాలు, లడ్డూ ప్యాకెట్లను సిద్ధం చేశారు. భక్తుల సౌకర్యార్థం కొండపైన, దిగువన ఎల్ఈడీ స్క్రీన్లు, చలువ పందిళ్లు, తాగునీరు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో 15 షటిల్ సర్వీసులతో పాటు నగరం నలుమూలలకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. భద్రత కోసం 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కల్యాణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అప్పన్న మూలవిరాట్ దర్శనాలు లభిస్తాయి, తిరిగి రాత్రి 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. శనివారం ఉదయం రథ కదలికలను అధికారులు శాస్త్రోక్తంగా పరిశీలించి రథోత్సవానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.సింహగిరిపై కల్యాణం ప్రాంగణంలో, మాడ వీధిలో, సింహగిరి బస్టాండ్, అన్నప్రసాద భవనం వద్ద, కొండదిగువ బస్టాండ్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేశారు. ఫైర్ సేఫ్టీ సిలిండర్లు, అగ్నిమాపక శకటం అందుబాటులో ఉంచారు. దేవస్థానంలో రెగ్యులర్ సీసీ కెమెరాలతో పాటు కల్యాణోత్సవం ప్రాంగణం తదితర ప్రాంతాల్లో అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.


