సీలేరు: గూడెం కొత్తవీధి మండలం, గుమ్మిరేవుల పంచాయతీ పరిధిలోని పరమసింగవరం గ్రామ పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయుడు పవన్ అండగా నిలుస్తున్నారు. మంగళవారం నర్సీపట్నం శ్రీ గణేష్ అకాడమి ఆర్థిక సహకారంతో పాఠశాలలోని 70 మంది గిరిజన విద్యార్థులకు పలకలు, పెన్సిల్ బాక్సులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు.పరమసింగవరం పాఠశాలకు ఉపాధ్యాయుడిగా వచ్చిన పవన్, ఇక్కడి గిరిజన పిల్లల దీన స్థితిని చూసి చలించిపోయారు. వెంటనే స్పందించి యలమంచిలిలోని ఒక వస్త్ర దుకాణ యాజమాన్యంతో మాట్లాడి, సుమారు 100 మంది విద్యార్థులకు రెండేసి జతల దుస్తులను అందజేశారు. కేవలం విద్యకే పరిమితం కాకుండా, గ్రామానికి అవసరమైన రహదారి సౌకర్యం, పాఠశాల భవన నిర్మాణం, విద్యుత్ సరఫరా వంటి సమస్యల పరిష్కారానికి అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.


