పీఏసీఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
అనకాపల్లి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆ ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. పీఏసీఎస్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల16 నుంచి నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా బుధవారం ఆందోళన చేశారు. స్థానిక నెహ్రూచౌక్ జంక్షన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా గల జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు వరకు ర్యాలీ నిర్వహించి, బ్యాంక్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేకుండా పోయిందన్నారు. 2019 తర్వాత జాయిన్ అయిన పీఏసీఎస్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, గ్రాడ్యుటీ రూ.ఐదు లక్షలకు పెంచాలని, డ్యూటీ పద్దులను రద్దు చేయాలని తదితర డిమాండ్లతో సమ్మె చేస్తున్నట్టు చెప్పారు. రెండు నెలలుగా నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ సరైన స్పందన లేకపోవడంతో సమ్మె చేయవలసి వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి జి.రమణ, సీఐటీయూ జిల్లా నాయకులు గనిశెట్టి సత్యనారాయణ, గంటా శ్రీరామ్, యూనియన్ జిల్లా నాయకులు వై.లక్ష్మణరావు, లోవరాజు, జగన్, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


