పూత పూసేనా..పిందె కట్టేనా!
నాతవరం: జీడిమామిడి తోటలు పొగమంచు కారణంగా కళ్లముందే పూత మాడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొదట్లో వాతావరణం బాగుండడంతో జీడి మామిడితోటలు పూత ఏపుగా రావడంతో ఈ ఏడాది దిగుబడులు బాగుంటాయన్న ఆశతో రైతులు ఉన్నారు. ప్రకృతి రైతన్నలపై మంచు రూపంలో కన్నెర్ర చేయడంతో పిందె వచ్చేటప్పుడు పూత అంతా మాడిపోతుంది. నెల రోజులుగా ప్రతి రోజు దట్టంగా మంచు కురవడంతో జీడిమామిడి తోటలు పూత నల్లగా మాడిపోవడంతో రైతులు బెంగ పెట్టుకుంటున్నారు. జిల్లాలో వరి తర్వాత జీడిమామిడి, పామాయిల్, సరుగుడు తోటల సాగుపై రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. నాతవరం, మాకవరపాలెం, నర్సీపట్నం, గొలుగొండ, కశింకోట, రోలుగుంట, నక్కపల్లి, పాయకరావుపేట, కె.కోటపాడు, చోడవరం, బుచ్చెయ్యపేట, రాంబిల్లి, ఎస్.రాయవరం, చీడికాడ మండలాల్లో అధికంగా జీడిమామిడి తోటలను రైతులు సాగు చేస్తున్నారు. ఉద్యావనశాఖాధికారుల రికార్డుల అధారంగా జిల్లాలో జీడిమామిడితోటలు 28 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
సాగు విస్తీర్ణంపై పరిశ్రమల ప్రభావం
ఇటీవల కాలంలో నక్కపల్లి, ఎస్.రాయవరం, రాంబిల్లి మండలాల్లో పలు పరిశ్రమలు ఏర్పాటుకు రైతుల నుంచి భూసేకరణ చేయడంతో ఆయా మండలాల్లో చాలా వరకు జీడిమామిడి తోటలు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. మిగతా మండలాల్లో జీడి మామిడి తోటలు పూత ఆశాజనకంగా ఉండటంతో మంచు కారణంగా నాశనమౌవుతుంది, ఇటీవల కాలంలో ఉదయం 8 గంటల వరకు రోడ్డు కన్పించని విధంగా వర్షం కురిసేలా మంచు కురియడంతో వాహనదారులు సైతం లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. ఎంతో కష్టపడి పెట్టుబడి పెట్టి సాగుచేస్తున్న జీడిమామిడి తోటలు పంట చేతికందివచ్చే సమయంలో ఈ విధంగా దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మంచు రూపంలో కొంత, తెగుళ్ల రూపంలో కొంత జీడి మామిడికి తీవ్ర సష్టం జరుగుతోంది. అరకొరగా కాస్తున్న జీడిమామిడి తోటలు పంటలను కోతులు కొంత నష్టం కలిగిస్తున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. మంచు కురియక ముందు పూత బాగా కన్పించేది. ప్రస్తుతం పిందె వచ్చే సమయంలో పూత మాడిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో తెగుళ్ల నిరవారణకు క్రిమిసంహరిక మందులు పిచికారి చేస్తున్నారు. తెగుళ్లు పీడిస్తున్నా రైతులకు సలహాలు సూచనలు ఇచ్చే అధికారులు మచ్చుకై నా గ్రామాల్లో కానరాలేదని రైతులు ఆరోపిస్తున్నారు. జీడిమామిడి తోటలు తెగుళ్లు పూత మామిడిపోతున్న విషయంపై జిల్లా ఉద్యవనశాఖాధికారి రాజశేఖర్ని సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు.
ప్రభుత్వమే అదుకోవాలి
జీడి మామిడి తోటలు సాగు చేసే రైతులను ప్రభుత్వమే అదుకోవాలి. మంచు రూపంలో తెగుళ్లు రూపంలో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. పెట్టుబడులు, క్రిమిసంహరిక మందుల రేట్లు గతంతో పోల్చుకుంటే దారుణంగా పెరిగిపోయాయి. పంట చేతికందే సమయంలో పూత మాడిపోవడం చూస్తే చాలా బాధేస్తుంది.
– కర్రి వెంకటరమణ, ఎ.శరభవరం గ్రామం
జీడిమామిడికి మంచుదెబ్బ
జిల్లా వ్యాప్తంగా 28 వేల ఎకరాల్లో
జీడిమామిడి సాగు
నక్కపల్లి, కశింకోట,
ఎస్.రాయవరం మండలాల్లో తగ్గిన సాగు
పూత పూసేనా..పిందె కట్టేనా!
పూత పూసేనా..పిందె కట్టేనా!
పూత పూసేనా..పిందె కట్టేనా!


