రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొన్న బైక్
కూర్మన్నపాలెం: అగనంపూడి ముఖ్య కూడలి వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలివి. గాజువాక పైడిమాంబకాలనీకి చెందిన వల్లూరి శ్రీనివాసరావు భార్య రమణమ్మ(48) అగనంపూడిలో పాలబూత్ నిర్వహిస్తోంది. అందువల్ల అగనంపూడిలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, అక్కడ కూడా నివాసం ఉంటున్నారు. రమణమ్మ తన వ్యక్తిగత పని నిమిత్తం శుక్రవారం సాయంత్రం కూర్మన్నపాలెం వెళ్లి తిరిగి వస్తున్నారు. సాయంత్రం వేళ అగనంపూడి జంక్షన్లో ఆటో దిగి రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో అనకాపల్లి జిల్లా మునగపాక మండలం చూచుకొండకు చెందిన సారిక నాగరాజు(48) తన కుమారుడు జవహర్తో కలిసి బైక్పై గాజువాక వైపు వస్తున్నారు. ఈ క్రమంలో జంక్షన్ వద్ద ఆమెను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రమణమ్మ తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించారు. బైక్పై నుంచి కిందపడిన తండ్రీకొడుకులు నాగరాజు, జవహర్లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా నాగరాజు మార్గమధ్యంలో మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన జవహర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జవహర్ వికలాంగుడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చూచుకొండలో విషాదం
మునగపాక: అగనంపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చూచుకొండకు చెందిన వడ్డీ వ్యాపారి సారిక నాగరాజు (51) మృత్యువాతకు గురి కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాగరాజు విశాఖలో వడ్డీ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం తన బైక్పై కుమారుడు జవహర్తో కలిసి విశాఖ వెళ్లి వ్యాపార కార్యక్రమాలు నిర్వహించుకుని తిరుగు ప్రయాణంలో అగనంపూడి వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న బాటసారిని తప్పించే క్రమంలో నాగరాజు కిందపడిపోయాడు. దీంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందగా బైక్ వెనుక కూర్చున్న కుమారుడు జవహర్కు గాయాలయ్యాయి. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న నాగరాజు మృతి వార్త తెలుసుకున్న గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఇద్దరి మృతి, ఒకరికి గాయాలు
రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొన్న బైక్


