
అనంతుని పవిత్రోత్సవాలకు ఏర్పాట్లు
కుంతీ మాధవ స్వామి ఆలయం (ఇన్సెట్)
శాంతి కల్యాణం జరపనున్న అనంతుని ఉత్సవ విగ్రహాలు
పద్మనాభం: స్థానిక కుంతీ మాధవస్వామి ఆలయంలో ఈ నెల 16 నుంచి 19 వరకు అనంత పద్మనాభస్వామి పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పవిత్రోత్సవాలకు అవసరమయ్యే పవిత్రాలను తమిళనాడులోని శ్రీరంగం నుంచి తీసుకొచ్చి, ఆలయంలో భద్రపరిచారు. నూతన వస్త్రాలు సమకూర్చారు. 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు పవిత్రోత్సవాలు ప్రాంభమవుతాయి. ఉత్సవాల్లో భాగంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ వంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 17న అగ్ని మథనం, అగ్ని ప్రతిష్టాపన, నిత్యహోమాలు, మూల మంత్రహోమం, పవిత్రాలకు అభిమంత్రణ, మహాఽశాంతి హోమం జరుపుతారు. 18న అష్ట కలశ స్నపన, పంచామృత అభిషేకాలు, నిత్య హోమం అనంతరం శ్రీరంగం నుంచి తెచ్చిన పవిత్రాలను స్వామికి సమర్పిస్తారు. కుంతీ మాధవస్వామి ఆలయంలోని కుంతీ మాధవస్వామి, శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి పెద్ద ఉత్సవ విగ్రహాలకు, చిన్న ఉత్సవ విగ్రహాలకు, రుక్ష్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి, గోదాదేవి, లక్ష్మీదేవి, గిరిపై ఉన్న అనంత పద్మనాభ స్వామికి పవిత్రాలు సమర్పిస్తారు. పవిత్రాల అలకరణలో ఈ మూర్తులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. 19న ఉదయం విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, నిత్య హోమం అనంతరం పవిత్రాలను విసర్జింప చేస్తారు. పూర్ణాహుతి నిర్వహించి, కుంతీ మాధవస్వామి ఆలయంలోని శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభస్వామి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా రూపొందించిన వేదిక వద్దకు తోడ్కొని వస్తారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఉదయం 11 గంటలకు శాంతి కల్యాణంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.

అనంతుని పవిత్రోత్సవాలకు ఏర్పాట్లు