
జూలో సందడిగా వన్యప్రాణి వారోత్సవాలు
ఆరిలోవ(విశాఖ): ఇందిరా గాంధీ జూ పార్కులో గురువారం వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభమయ్యా యి. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా, మొదటి రోజు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ‘తేనెటీగలు, పక్షులు, సీతాకోక చిలుకలు, సముద్ర జీవ వైవిధ్యం – మనం’ –‘మానవ – ఏనుగు సంఘర్షణ’ వంటి అంశాలపై ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీలలో నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు, వివిధ వయసుల వారు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. వన్యప్రాణులపై అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జూ క్యూరేటర్ జి. మంగమ్మ ఈ సందర్భంగా తెలిపారు. జూ అసిస్టెంట్ క్యూరేటర్ గోపి, ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.