
అధికారుల నిర్ణయం.. విద్యార్థులకు శాపం
నర్సీపట్నం: విద్యాశాఖ అధికారుల నిర్ణయం.. విద్యార్థులకు శాపంగా మారింది. ప్రభుత్వం తీసుకొచ్చిన పాఠశాలల విలీన ప్రక్రియలో భాగంగా విద్యాశాఖ అధికారుల తొందరపాటు చర్యలతో కొంత మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకమైంది. ఒకే పంచాయతీలో ఒకటి నుంచి మూడు పాఠశాలలు ఉంటే వీటిని కలిపి సౌకర్యాలు ఉన్న పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూల్గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విలీన ప్రక్రియతో నర్సీపట్నం మండలం, దుగ్గాడ పంచాయతీ పరిధిలోని శ్రీరాంపురం గ్రామ ఎంపీపీ స్కూల్ విద్యార్థులకు శాపంగా మారింది. ఫౌండేషన్ స్కూల్గా కాకుండా బేసిక్ ప్రైమరీ స్కూల్గా కొనసాగించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడిని గ్రామస్థులు కలిశారు. స్పీకర్ ద్వారా మేలు చేకూరుతుందని ఆశిస్తున్నారు.
దుగ్గాడ పంచాయతీ పరిధిలో దుగ్గాడ, శ్రీరాంపురం ఎంపీపీఎస్ పాఠశాలలతో పాటు సమీపంలో ఉన్న పాతబయపురెడ్డిపాలెం పాఠశాలను విలీనం చేసి, దుగ్గాడ పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూల్గా మార్చేందుకు అధికారులు మొదట నిర్ణయం తీసుకున్నారు. పాతబయపురెడ్డిపాలెం స్కూల్ మున్సిపాలిటీ పరిధిలో ఉండడంతో విలీన ప్రక్రియకు బ్రేక్ పడింది. దుగ్గాడ, శ్రీరాంపురం పాఠశాలలను యథావిధంగా బేసిక్ ప్రైమరీ స్కూల్స్గా వదిలేయవలసి ఉండగా శ్రీరాంపురం పాఠశాలను ఫౌండేషన్ స్కూల్ (1, 2 తరగతులు)గా మార్పుచేశారు. అధికారుల అనాలోచిత నిర్ణయంతో 3, 4, 5 తరగతుల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ పాఠశాలలో మొత్తం 26 మంది విద్యార్థులు ఉండగా, వీరిలో 3, 4, 5 తరగతుల విద్యార్థులవారు 14 మంది ఉన్నారు. అర కిలోమీటరు దూరంలో ఉన్న దుగ్గాడ స్కూల్లో జాయిన్ చేద్దామంటే రాకపోకలు సాగించేటప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఒక వేళ జాయిన్ చేసినా సింగల్ టీచర్ వల్ల ఒరిగేదిలేదు. విద్యాశాఖ అధికారుల తీరుపై గ్రామస్ధులు మండిపడుతున్నారు. పాఠశాలను కాపాడుకునేందుకు గ్రామస్తులు సిద్ధమవుతున్నారు.
పాఠశాలల విలీనంతో
చదువుకు అష్టకష్టాలు
ఒక విధంగా పాఠశాలను ఎత్తివేయటమే..
విలీనం పేరుతో పాఠశాలను ఎత్తివేయటమే ఇది. అధికారుల తీరుతో 3వ తరగతి చదువుతున్న మా పాప గీతను ఎక్కడ జాయిన్ చేయాలో అర్ధంకాని పరిస్థితి. మిగతా పిల్లలు రోడ్డున పడ్డారు. మేమంతా వ్యవసాయ కూలీలం. ప్రైవేటు పాఠశాలల్లో చదివించుకునే ఆర్ధిక స్తోమత లేదు. ఊళ్లో ఉన్న పాఠశాలను తీసివేయటం సరికాదు.
–నల్లబెల్లి రాము, శ్రీరాంపురం

అధికారుల నిర్ణయం.. విద్యార్థులకు శాపం