
సైబర్.. టెర్రర్
అచ్యుతాపురం అడ్డాగా అసాంఘిక కార్యకలాపాలు
● రెండో రోజు సాఫ్ట్వేర్ డీ–కోడ్ చేయడానికి ప్రత్యేక బృందాలు ● సైబర్ నేరస్తులపై కొనసాగుతున్న విచారణ ● అనుమానితులను గుర్తిస్తున్న పోలీసు అధికారులు ● భయాందోళనలో స్థానిక ప్రజలు
స్థానిక పోలీస్ అధికారి సెలవు రోజునే దాడులు
అచ్యుతాపురం సెజ్లో జరిగే ఆన్లైన్ ట్రాప్ అంతా స్థానిక పోలీసులకు తెలిసే జరుగుతుందా..? కొన్ని నెలలుగా ఈ మోసాలు జరుగుతున్నా పోలీసులు ఎందుకు రైడ్ చేయలేదు..? ప్రజల మనసుల్లో మెదులుతున్న ప్రశ్నలివి. పోలీస్ ఉన్నతాధికారులకు సైతం ఈ సందేహాలు వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో పేకాట డెన్లపై, ఆన్లైన్ కోడిపందేలతో పాటు పలు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా.. స్థానిక పోలీస్ అధికారి, సిబ్బంది దాడులు జరిపేవారు కాదని తెలుస్తోంది. దాడులు జరిపినా ముందుగా సమాచారం లీక్ చేసేవారని ఉన్నతాధికారులు గుర్తించారు. అందుకే జిల్లా పోలీసు ఉన్నతాధికారే రంగంలోకి దిగి స్థానికంగా మరో డివిజన్ స్థాయి పోలీస్ అధికారితో కలిసి రైడింగ్కు వ్యూహరచన చేసినట్టు చెబుతున్నారు. స్థానిక పోలీసు అధికారి సెలవు రోజున ఈ దాడులు జరగడం గమనార్హం.
సాక్షి, అనకాపల్లి/అచ్యుతాపురం రూరల్: పారిశ్రామికీకరణతో ప్రగతి బాట పట్టిన ప్రాంతమది.. ఇప్పుడు సైబర్ టెర్రర్తో కలవరపడుతోంది. అచ్యుతాపురానికి సమీపంలోని భోగాపురంలో మంగళవారం రాత్రి పలు అపార్ట్మెంట్లు, వాటిలోని ఫ్లాట్లపై పోలీసు దాడి ఈ ప్రాంతంలో కలకలం సృష్టించింది. ఆన్లైన్ ట్రాపింగ్కు పాల్పడిన సైబర్ నేరగాళ్లను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నట్టు సమాచారం. నిందితులు వాడుతున్న సాఫ్ట్వేర్ డీ–కోడ్ చేసే ప్రయత్నంలో సంబంధిత శాఖలు నిమగ్నమై ఉన్నాయి. అచ్యుతాపురం కేంద్రంగా ఎన్నాళ్లుగా ఈ ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి..? వీరి ద్వారా ఆన్లైన్ ట్రాపింగ్లో మోసపోయిన వారెందరు..? తదితర కోణాల్లో పోలీసులు అత్యంత రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ డీ–కోడ్ అయితేనే గానీ వివరాలు చెప్పలేమని పోలీసు అధికారులు తెలిపారు.
100 మందికి పైగా సైబర్ నేరగాళ్లు
మంగళవారం రాత్రి భోగాపురం సమీపంలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో కార్యకలాపాలు సాగిస్తున్న 100 మందికిపైగా సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో మూడొంతుల మంది పారిపోయారు. పోలీసుల అదుపులో ఉన్న కొందరు సైబర్ నేరగాళ్ల నుంచి సమాచారం రాబడుతున్నారు. బుధవారం ఉదయం కూడా కొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. భోగాపురం సమీపంలో ఉన్న పవన్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లోని మొత్తం 40 ఫ్లాట్లలో వీరు సైబర్ నేరాలు నడిపిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇందులో పాలుపంచుకుంటున్న వారు సమీపంలోని వివిధ అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్నట్టు తెలుస్తోంది. వీరు చాలా గోప్యత పాటించేవారని, వంటలు చేసుకోవడానికి ఉపయోగించే గ్యాస్, పాలు, ఏమైనా పార్శిళ్లు వచ్చినా కింద పెట్టేసి వెళ్లిపోవాలే తప్ప.. వారుండే ఫ్లాట్లలోకి వెళ్లనిచ్చేవారు కాదని చెబుతున్నారు. శని, ఆది వారాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా వాడుకుంటున్నట్లు స్థానికులు తెలిపారు. వారు ఆరు నెలలుగా ఇక్కడ ఉన్నట్టు తెలుస్తోంది.