నిధుల గండం | - | Sakshi
Sakshi News home page

నిధుల గండం

May 16 2026 12:51 AM | Updated on May 16 2026 12:51 AM

పల్లెకు

పన్నులు వసూలుకాక కునారిల్లుతున్న గ్రామ పంచాయతీలు

కొయ్యూరు: జిల్లాలో ఇంటి పన్నుల వసూళ్లు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన బకాయిలు, ప్రస్తుత ఏడాది పన్నులు కలిపి మొత్తం రూ. 7.73 కోట్లకు చేరుకున్నాయి. గ్రామ పంచాయతీల మనుగడకు ప్రధాన వనరుగా ఉన్న ఇంటి పన్నుల వసూలు మందగించడంతో, స్థానిక సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే ప్రమాదం కనిపిస్తోంది.

జనగణన బాధ్యతలతో..

సాధారణంగా ఇంటి పన్నుల వసూలు ప్రక్రియను పర్యవేక్షించాల్సిన సచివాలయ సిబ్బందికి ప్రస్తుతం జనగణన పనులను అప్పగించడమే ఈ మందగింపునకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

● గతంలో ప్రతి జనగణన ప్రక్రియకు ఉపాధ్యాయులను నియమించేవారు. అయితే, ఈసారి వారిని మినహాయించి కేవలం సచివాలయ సిబ్బందిని మాత్రమే వినియోగించడంతో, వారిపై పనిభారం పెరిగి పన్నుల వసూలు కుంటుపడింది.

● జిల్లాలోని ఏ ఒక్క మండలంలో కూడా కనీసం 5 శాతం వసూళ్లు కూడా సాధించలేకపోవడం గమనార్హం.

పాలనపై తీవ్ర ప్రభావం

గ్రామ పంచాయతీలు తమ దైనందిన కార్యకలాపాలకు, ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణకు ఇంటి పన్నుల నుంచి వచ్చే ఆదాయంపై అధికంగా ఆధారపడి ఉంటాయి.

● గ్రామాలలోని చెత్తను సేకరించి, శుభ్రం చేసే ‘క్లాప్‌ మిత్రల’కు వేతనాల చెల్లింపులు ఈ పన్నుల ఆదాయం నుంచే జరుగుతాయి.

● వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, ఇతర అత్యవసర గ్రామాభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడే అవకాశం ఉంది.

● కొయ్యూరు మండలంలో పన్నుల వసూలును వేగవంతం చేసేందుకు అధికారులు కొన్ని చర్యలు చేపట్టినప్పటికీ, ఆశించిన ఫలితాలు రావడం లేదు. గతంలో ప్రజలు నగదు చెల్లించడానికి నేరుగా సచివాలయానికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా వాట్సాప్‌ ద్వారా గానీ, సచివాలయాల్లో అందుబాటులో ఉన్న క్యూఆర్‌ కోడ్‌ స్కానర్ల ద్వారా గానీ సులభంగా పన్నులు చెల్లించే వెసులుబాటు కల్పించారు.

గడువు విధించినా..

జనగణన పనులలో కొందరు సిబ్బంది నిమగ్నమైనప్పటికీ, మిగిలిన సిబ్బంది ద్వారా ఇంటింటికీ డిమాండ్‌ నోటీసులు పంపిణీ చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు పన్నులు చెల్లించాలని గడువు విధిస్తున్నారు.

దృష్టిపెట్టకుంటే కష్టమే..

ఆర్థిక సంవత్సరం ముగిసిన తరుణంలో, కనీసం సగం మొత్తమైనా వసూలు కాకపోతే పంచాయతీల మనుగడ కష్టం కానుంది. జనగణన పనులతో పాటు పన్నుల వసూలుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా డిజిటల్‌ చెల్లింపుల విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించి, ప్రోత్సహించాలని పలువురు సూచిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement