సీతంపేట: విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కె.కె. లైన్ను చేర్చాలని డిమాండ్ చేస్తూ శనివారం ఎంపీ శ్రీభరత్ బీచ్ రోడ్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి వినతిపత్రం అందజేయనున్నట్లు ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు జె.టి. రామారావు తెలిపారు. శుక్రవారం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ‘కె.కె. లైన్తో ఉన్న రైల్వే జోన్ – భవిష్యత్తు కార్యాచరణ’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రధాన ఆస్తులు, ఆదాయ మార్గాలను ఇతర జోన్లకు అప్పగించి విశాఖకు కేవలం పేరు మాత్రమే ఇవ్వడం ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కె.కె. లైన్ లేకుండా విశాఖ రైల్వే జోన్ అసంపూర్ణమని, దీని సాధన కోసం పాదయాత్రలు, ర్యాలీలు, ‘చలో ఢిల్లీ’ వంటి కార్యక్రమాలతో దశలవారీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు ఇప్పటికై నా గళమెత్తాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు అడారి కిషోర్ కుమార్, కస్తూరి వెంకట్రావు, గొలగాని రాము, ఎం.ఎల్.ఎన్. పట్నాయక్ , పలు మహిళా, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


