డాబాగార్డెన్స్ (విశాఖ): హనుమంతవాక నుంచి గోపాలపట్నం వరకు విస్తరించి ఉన్న సింహాచలం కొండను చంద్రబాబు ప్రభుత్వం బోడిగుండు చేస్తోందని సీపీఎం నాయకుడు గంగారావు ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల కొండ ప్రాంతంలో డేటా సెంటర్ పేరుతో భారీ యంత్రాలతో తవ్వకాలు చేపడుతున్నారని మండిపడ్డారు. నరసింహ స్వామి కొలువై ఉన్న పవిత్ర కొండపై ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపడం ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. ఈ చర్యలను భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. అలాగే సింహాచలం కొండ నుంచి వచ్చే వర్షపు నీరు ముడసర్లోవకు చేరే సహజ ప్రవాహ వ్యవస్థ దెబ్బతింటుందని, కొండను తవ్వడం వల్ల నీటి ప్రవాహానికి అంతరాయం కలిగే ప్రమాదం ఉందని గంగారావు ఆందోళన వ్యక్తం చేశారు.


