గూడెంకొత్తవీధి: రైతులకు అధిక దిగుబడినిచ్చే మేలురకపు కాఫీ మొక్కలను సరఫరా చేయాలని కోరుతూ అరకులో గురువారం కాఫీ బోర్డు చైర్మన్ ఎంజే దినేష్, సీఈవో ఎం. కూర్మారావులకు కాఫీ రైతుల సంఘం వినతిపత్రం అందజేసింది. ఈ కార్యక్రమంలో కాఫీ రైతుల సంఘం అధ్యక్షులు అడపా విష్ణుమూర్తి, అభ్యుదయ కాఫీ రైతు అడపా లక్ష్మి పాల్గొన్నారు. నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని, అధునాతన పద్ధతుల్లో సాగు చేసేందుకు అవసరమైన సాంకేతికతను అందించాలని కోరినట్టు వారు తెలిపారు. అలాగే ఆధునిక కాఫీ ప్రాసెసింగ్ యూనిట్లు, డ్రైయింగ్ యార్డులు, నిల్వ గోదాములు, విలువ ఆధారిత ఉత్పత్తి కేంద్రాలను మంజూరు చేయాలని విన్నవించామని వారు పేర్కొన్నారు. మార్కెటింగ్ రంగాన్ని బలోపేతం చేసేందుకు రైతు ఉత్పత్తి గ్రూపులను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయాలని కోరారు. కాఫీ ధరల్లో స్థిరత్వం ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, సేంద్రియ సాగును ప్రోత్సహించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
ఆర్వీనగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్స వేడుకలను జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశామన్నారు. వీటిపై కాఫీ బోర్డు చైర్మన్, సీఈవో సానుకూలంగా స్పందించారని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని అడపా విష్ణుమూర్తి తెలిపారు.
కాఫీ బోర్డుకు గిరి రైతుల విన్నపం


