నాతవరం: మండలంలో వెదురుపల్లి గ్రామానికి చెందిన లగుడు సన్యాసియ్య అలియాస్ ముసలియ్య (55) మద్యం మత్తులో గడ్డి మందు సేవించి మృతి చెందాడు. నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావు వివరాల ప్రకారం.. వ్యవసాయం పనులు చేసుకుంటూ జీవనం సాగించే సన్యాసియ్య ఆదివారం ఉదయం నుంచే మద్యం సేవిస్తున్నాడు. ఎప్పటి మాదిరిగానే పనులు చూసుకుని సాయంత్రం పొలంవద్ద పాకలో దాచుకున్న మద్యం బాటిల్ తాగేందుకు వెళ్లాడు. మద్యం బాటిల్ పక్కనే ఉన్న గడ్డి మందు బాటిల్ తాగేసాడు. తాగిన కొద్ది సేపటికే అపస్మారక స్థితికి చేరడంతో గమనించిన కుటుంబీకులు వెంటనే నర్సీపట్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. కుటుంబ సభ్యులు సోమవారం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసారు. ఈ సంఘటనపై కేను నమోదు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలకు వివాహమైంది.
అచ్యుతాపురం రూరల్: మండలంలో తిమ్మరాజుపేట గ్రామానికి చెందిన అయినేల్లు పోతురాజు (51) గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనారోగ్య సమస్యలు తాళలేక కుటుంబానికి భారం కాకూడదని మనస్థాపంతో ఈ నెల 18న గడ్డి మంది తాగారు. కుటుంబ సభ్యులు అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్లో చేర్పించారు. ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందారు. భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


