చోడవరంలో తాగునీటికి కటకట
చోడవరం: అసలే వేసవి.. ఎండలు మండిపోయి జనం దాహం..దాహం అంటున్న సమయంలో కుళాయిల ద్వారా మురుగునీరు సరఫరా కావడం ప్రజలకు మరింత ఇబ్బందులకు గురిచేసింది. పట్టణంలో పలు ప్రాంతాల్లో కుళాయిలు ద్వారా కలుషిత నీరు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యడ్లవీధి, గునిశెట్టివారి వీధి, పిల్లావారితోట, దుడ్డువీధి, చిన్నబజార్, వ్యాపారవీధి ప్రాంతాల్లో కుళాయిల ద్వారా సోమవారం కలుషిత నీరు వచ్చింది. పట్టణంలో బోర్ల ద్వారా ఉప్పునీరే వస్తుండడంతో అందరూ కుళాయిల మంచినీటిపైనే ఆధారపడే పరిస్థితి. 30వేల మంది ప్రజలు ఉన్న పంచాయతీల్లో తరుచూ అంతరాయం ఏర్పడడం, కలుషిత నీరు సరఫరా అవ్వడం జరుగుతుంది. పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టనట్టు వ్యవహరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.


