సాక్షి,పాడేరు: చల్లటి వాతావరణానికి పేరొందిన జిల్లాలో ఈ ఏడాది ఎండలు మండుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొయ్యూరులో 38.5 డిగ్రీలు, అరకులోయలో 38.7, పాడేరులో 37, జి.మాడుగులలో 36.4, అనంతగిరిలో 35.1, చింతపల్లిలో 34, పెదబయలులో 33.3, ముంచంగిపుట్టులో 33.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు సోమవారం నమోదయ్యాయి. ఉదయం 9గంటల నుంచే ఎండ విజృంభించింది. మధ్యాహ్నం సమయంలో అధిక ఎండతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడ్డారు.మండల కేంద్రాలు,వారపుసంతల్లో చిరువ్యాపారులతో పాటు గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.జిల్లా కేంద్రం పాడేరులో సాయంత్రం వరకు రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.


