వైఎస్సార్‌సీపీలో 60 కుటుంబాల చేరిక | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో 60 కుటుంబాల చేరిక

Apr 28 2026 7:35 AM | Updated on Apr 28 2026 7:35 AM

అరకులోయటౌన్‌: మండలంలోని పెదలబుడు మేజర్‌ పంచాయతీ కేంద్రంతో పాటు కరసాలిగుడ, గరడగుడ గ్రామాల్లోని తెలుగుదేశం, ఇతర పార్టీలకు చెందిన 60 కుటుంబాల వారు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సమక్షంలో సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు మురళీ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణిక్య పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ అరాచకపాలనకు ప్రజలు విసిగెత్తిపోయి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి, చేయూత, రైతు భరోసా, ఆరోగ్య శ్రీ తదితర పథకాలను పక్కాగా అమలు చేసినట్టు చెప్పారు. చంద్రబాబు పాలనలో వంట గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో రూ.కోట్లు వెచ్చించి రహదారులు నిర్మిస్తున్నామని చెబుతున్నప్పటికీ పినకోట, పెదకోట, డుంబ్రిగుడ మండలం పెదపాడులో డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేసిన రోడ్లకే దిక్కులేకుండా పోయిందన్నారు.పెదపాడు పాఠశాల అత్యధునికంగా నిర్మిసామని హామీ ఇచ్చి పట్టించుకోవడం మానేశారని చెప్పారు.అంతకు ముందు ఎమ్మెల్యేతోపాటు పార్టీ నాయకులకు గ్రామ గిరిజనులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు కమిడి అశోక్‌కుమార్‌, నియోజకవర్గ బూత్‌ కమిటీ ఇన్‌చార్జి పాంగి విజయ్‌, అరకులోయ, డుంబ్రిగుడ మండల అధ్యక్షులు రామ్మూర్తి, పాంగి పరశురాం, మండల పార్టీ ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు పాంగినాగేశ్వరరావు, వైస్‌ ఎంపీపీ కిల్లో రామన్న, మండల యువజన విభాగం అధ్యక్షుడు బోయి కిరణ్‌ కుమార్‌, నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement