● పాడేరు, అరకు ఎమ్మెల్యేలువిశ్వేశ్వరరాజు, మత్స్యలింగం
పాడేరు : జిల్లా వ్యాప్తంగా ఉద్దేశపూర్వకంగానే పెట్రోల్, డీజిల్ కొరత సృష్టిస్తున్నారని పాడేరు, అరకు ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి సోమవారం జిల్లా కేంద్రం పాడేరులోని పలు పెట్రోల్ బంకులను వారు తనిఖీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజిల్ కొరత సృష్టిస్తూ వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీలు ఈ వ్యవహరంపై ప్రశ్నిస్తుంటే ఒక్క ఇండెంట్ కూడా పెండింగ్లో లేకుండా సరఫరా చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం అసత్యం చెబుతోందన్నారు. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలుపూర్తి కాగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతారని ప్రచారం జరుగుతుండడంతో డీలర్లు స్టాక్ నిల్వ చేస్తున్నారన్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసినా కనీసం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో 4,510 పెట్రోల్ బంకులు ఉంటే 70 శాతం బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గాడి సత్యనారాయణ, వైస్ ఎంపీపీలు కుడుముల సత్యనారాయణ, వెంకటరమణ, వైఎస్సార్సీపీ నాయకులు కోటిబాబు నాయుడు, కన్నాపాత్రుడు, బంగర్రాజు పాల్గొన్నారు.


