మద్దిలపాలెం (విశాఖ): డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన న్యాయదేవత విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఏయూ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. న్యాయ ప్రక్రియలో జాప్యం జరిగితే ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలకు ఉన్న విశ్వాసం దెబ్బతింటుందని హెచ్చరించారు. కోర్టుల్లో భారీగా పేరుకుపోయిన కేసుల సంఖ్యను తగ్గించాలని, వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.సీతా మాణిక్యం మాట్లాడుతూ.. తక్షణ న్యాయం కొన్ని సందర్భాల్లో సాధ్యం కానప్పటికీ, విచారణలో సుదీర్ఘ జాప్యాలు ఉండకూడదని అభిప్రాయపడ్డారు. న్యాయపరమైన భాష సంక్లిష్టంగా ఉండకూడదని, సామాన్యులకు కూడా సులభంగా అర్థమయ్యేలా సరళంగా ఉండాలని వక్తలు పేర్కొన్నారు. ప్రొఫెసర్ కేశవరావు, ప్రొఫెసర్ ఎ.రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.


