మద్దిలపాలెం (విశాఖ): సామాజిక, మేధో ప్రగతికి ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా నిలిచిందని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అన్నారు. ఎన్నో తరాలను తీర్చిదిద్దిన ఘనత ఈ విశ్వవిద్యాలయానికే సొంతమని, దేశంలోనే నంబర్ 1 వర్సిటీగా ఏయూ ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఏయూ శతాబ్ది వేడుకల్లో భాగంగా, వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. విశాఖతోనూ, ఏయూతోనూ తనకు ఎంతో భావోద్వేగ అనుబంధం ఉందన్నారు. ఉన్నత విద్యా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం సమూల మార్పులు చేపడుతోందని, విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తెచ్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. అంతకుముందు వర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. యూనివర్సిటీ ఫస్ట్ అనే నినాదంతో అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏయూ అలుమ్ని అసోసియేషన్ అధ్యక్షుడు కె.వి.వి.రావు మాట్లాడుతూ.. ఏయూలో విద్యను అభ్యసించడం పూర్వజన్మ సుకృతమన్నారు. అనంతరం జైపూర్ రాజవంశీయులు మయూఖ కుమారి దేవి, పాలకమండలి సభ్యులను ఘనంగా సత్కరించారు. ప్రతిభ కనబరిచిన ఆచార్యులకు ఫ్యాకల్టీ ఎక్సలెన్స్ అవార్డులు, అలుమ్ని అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, ప్రిన్సిపాల్స్, డీన్లు, ఉద్యోగులకు జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. వివిధ అంశాల్లో విశేష ప్రతిభ చూపిన వారికి పురస్కారాలను అందజేశారు.
హెచ్ఆర్డీ కార్యదర్శి కోన శశిధర్


