సాక్షి, పాడేరు: భారత ప్రభుత్వం తలపెట్టిన స్వీయ గణనపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంగా జిల్లా కేంద్రం పాడేరులో శనివారం ఉదయం చేపట్టిన 5కే రన్ ఉత్సాహంగా సాగింది. డాక్టర్ అంబేడ్కర్ సెంటర్లో ఈ రన్ను కలెక్టర్ టి.నిశాంతి ప్రారంభించారు. అక్కడ నుంచి ప్రభుత్వ మెడికల్ కళాశాల వరకు, తిరిగి అంబేడ్కర్ సెంటర్ వరకు 5 కిలోమీటర్ల పరుగు విజయవంతంగా నిర్వహించారు. కలెక్టర్తో పాటు జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్మవర్మ, అన్ని శాఖల అధికారులు, మెడికల్ కళాశాల, నర్సింగ్ విద్యార్థులు ఈ రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వీయ జనగణన ప్రక్రియను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎవరి సహాయం లేకుండానే ప్రజలు తమ మొబైల్ ఫోన్ల ద్వారా సులభంగా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రశ్నలన్నీ సరళంగానే ఉంటాయన్నారు. అనంతరం 5కే రన్లో విజేతలుగా నిలిచిన వి.రాజు(వైద్య ఉద్యోగి) వి.రిషి(ప్రభుత్వ డిగ్రీ కళాశాల,) వెంకట్(ప్రభుత్వ డిగ్రీ కళాశాల), కె.ప్రణీత్, యోగిలను కలెక్టర్ అభినందించి బహుమతులు అందజేశారు.


