● జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ
● పెట్రోల్ బంకు, గ్యాస్ గొడౌన్ల తనిఖీ
డుంబ్రిగుడ/హుకుంపేట: గిరిజన ప్రాంతాల్లోని వినియోగదారులకు మెరుగైన సేవలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. శనివారం హుకుంపేట, డుంబ్రిగుడ మండలాల పరిధిలోని జీసీసీ పెట్రోల్ బంకు, గ్యాస్ గొడౌన్ల్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెట్రోల్ బంకు స్టాక్ రికార్డులను పరిశీలించారు. గ్యాస్ గొడౌన్ల్లో ఉన్న సిలిండర్ల నిల్వలు, రికార్డులను స్వయంగా తనిఖీ చేశారు. స్టాక్ వివరాల్లో ఎటువంటి వ్యత్యాసాలు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ఎటువంటి జాప్యం జరగకూడదని, పెట్రోల్ బంకుల వద్ద వినియోగదారులకు అవసరమైన కనీస సదుపాయాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీల్లో జిల్లా పౌర సరఫరాల అధికారి వి.మోహన్, ఏఎస్వో ప్రశాంత్, మండల డిప్యూటీ తహసీల్దార్, తదితరులు పాల్గొన్నారు.


