● కలెక్టర్ నిశాంతి ఆదేశం
● పీజీఆర్ఎస్లో 84 వినతుల స్వీకరణ
పాడేరు: పీజీఆర్ఎస్కు వచ్చే వినతులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ నిషాంతి అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం, మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ నిషాంతి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పలు సమస్యలపై జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, ఇంచార్జీ డీఆర్వో లోకేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నీలకంఠేశ్వరరావులతో కలిసి 84 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన వినతులను సంబంధిత శాఖలకు పంపించి ఎంత గడువులోగా పరిష్కారిస్తారో అర్జీదారుడికి తెలియజేయాలన్నారు. ప్రతి శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్కు జిల్లా అధికారులంతా సమగ్ర సమాచారంతో తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. హాజరు కాని అధికారులు కారణం చూపిస్తూ ముందుగా అనుమతి పొందాలన్నారు. మండల స్థాయిల్లో ఎంపీడీవో కార్యాలయాల వద్ద ప్రతి సోమవారం, గ్రామ స్థాయిల్లో గ్రామ సచివాలయాల వద్ద ప్రతి రోజు సమస్యలపై అర్జీలు స్వీకరించాలని ఆదేశించారు. గ్రామ, మండల స్థాయిల్లో పరిష్కారం కాని అర్జీలు జిల్లా స్థాయి అధికారుల వద్దకు తీసుకువచ్చి పరిష్కరించాలన్నారు. అర్జీదారులు మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాల్ సెంటర్కు ఫోన్ చేసి సమస్య ఎంత వరకు పరిష్కారమైందో తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూ డీడీ పరిమళ, హౌసింగ్ పీడీ బాబు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నందు, డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణమూర్తి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మోహన్, ఐసీడీఎస్ పీడీ ఝాన్షీరామ్ పడాల్, ఎల్డీఎం మాతునాయుడు తదితరులు పాల్గొన్నారు.


