● జిల్లా వ్యాప్తంగా ఏడు పరీక్షా కేంద్రాలు
సాక్షి,పాడేరు: సాంకేతిక విద్యాశాఖ నిర్వహిస్తున్న పాలిసెట్–2026కు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పాడేరులోని ఆరు పరీక్షా కేంద్రాలు, చింతపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడు పరీక్షా కేంద్రాలకు సంబంధించి 1680 మంది విద్యార్థులకు హాల్టికెట్లు జారీ చేసామని పాలిసెట్ జిల్లా సమన్వయకర్త, పాడేరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నోడల్ ప్రిన్సిపాల్ ఎం.హరిబాబు తెలిపారు. పాడేరులోని ఆరు కేంద్రాలకు సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెంటర్లో 249 మంది, ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లో 240 మంది, తలారిసింగి గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాలలో 225 మంది, కుమ్మరిపుట్టు ఏపీఆర్ పాఠశాలలో 224 మంది, ఏపీఆర్ కళాశాల సెంటర్లో 240 మంది, శ్రీకృష్ణాపురం గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాల సెంటర్లో 228 మంది, చింతపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 274మంది విద్యార్థుఽలు పాలిసెట్ పరీక్ష రాయనున్నారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని, విద్యార్థులంతా ఉదయం 9గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. పాలిసెట్ జిల్లా పరిశీలకుడు డాక్టర్ బీఆర్ఎస్ గంగస్వామి, జిల్లా సమన్వయకర్త హరిబాబు, పాడేరు పట్టణ పరిశీలకుడు కె.రాజు శుక్రవారం తనిఖీలు జరిపి ఏర్పాట్లను పరిశీలించారు.144సెక్షన్తో పాటు పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.


