అల్లిపురం(విశాఖ): మార్చిలో వివిధ కేసుల పరిష్కారంలో విశేష ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందికి నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి రివార్డులు అందజేశారు. శుక్రవారం కమిషనరేట్లో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం, చోరీకి గురైన సొత్తును రికవరీ చేయడం, కీలక నిందితులను అరెస్టు చేయడంలో సిబ్బంది చూపిన చొరవ అభినందనీయమన్నారు. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పేరు మోసిన నేరస్తులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు. రివార్డులు పొందిన వారిలో హోంగార్డు నుంచి సీఐ స్థాయి వరకు 244 మంది వరకు ఉన్నారు. అందరూ ఇదే స్ఫూర్తితో పనిచేసి, నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కమిషనర్ సూచించారు.


