ముంచంగిపుట్టు: అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు సెన్సస్ (జనగణన), బీఎల్వో విధులను తక్షణమే రద్దు చేయాలని అంగన్వాడీ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఈశ్వరి, గంగాభవాని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిరసన తెలిపారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సూపర్వైజర్లకు అందజేశారు. అంగన్వాడీలకు ఇతర శాఖల పనులు అప్పగించవద్దని ప్రభుత్వం స్పష్టమైన సర్క్యులర్ జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో సెన్సస్, బీఎల్వో విధులు కేటాయించడం అన్యాయమని వారు పేర్కొన్నారు. అదనపు డ్యూటీల పేరుతో ఒత్తిడి చేస్తూ అంగన్వాడీలను మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణతో పాటు గర్భిణులకు, బాలింతలకు టేక్ హోమ్ రేషన్ పంపిణీ వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నామని, కొత్త పనులు అప్పగిస్తే సేవలపై ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల అధ్యక్షులు భీమరాజు, కార్యదర్శి శంకర్రావు, అంగన్వాడీ సంఘ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఈశ్వరి, గంగాభవాని డిమాండ్


