అరకులోయ టౌన్/డుంబ్రిగుడ: పర్యాటక రంగంలో అరకు పైనరీ విశిష్టతను చాటేలా మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర అటవీ శాఖ పీసీసీఎఫ్ డాక్టర్ పీవీ చలపతిరావు అధికారులను ఆదేశించారు. బుధవారం అరకులోయ పర్యటనలో భాగంగా ఆయన డుంబ్రిగుడ మండలంలోని అరకు పైనరీని సందర్శించి, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా పైనరీకి మంచి గుర్తింపు ఉందన్నారు. భవిష్యత్తులో దీనిని అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలని, పర్యాటకులకు కేవలం ఆహ్లాదాన్నే కాకుండా అటవీ సంపదపై అవగాహన కల్పించేలా విజ్ఞానదాయకమైన ప్రాజెక్టులను రూపకల్పన చేయాలని సూచించారు. పైనరీ అభివృద్ధి ద్వారా శాంతినగర్ వీఎస్ఎస్ సభ్యులతో పాటు, సమీప గ్రామాల్లోని గిరిజనులకు అధికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని అరకు రేంజ్ అధికారి బొర్రా కోటేశ్వరరావుకు సూచించారు. అనంతరం పైనరీ సమీపంలోని వీఎస్ఎస్ కొండ ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విశాఖ సర్కిల్ సీసీఎఫ్ బీఎం దివాన్ మైథన్, డీఎప్వో కె. ఉమామహేశ్వరి, విశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్వో సునీల్, అరకు రేంజర్ బొర్రా కోటేశ్వరరావు, సెక్షన్ ఆఫీసర్ కృష్ణంనాయుడు, బీట్ ఆఫీసర్లు చంటి, పి. ఉద్దంగి, పైనరీ మేనేజర్ శేఖర్, అరకు, అనంతగిరి రేంజ్ సిబ్బంది, వీఎస్ఎస్ సభ్యులు పాల్గొన్నారు.
పీసీసీఎఫ్ చలపతిరావు


