సీలేరు : ఏపీ జెన్కో ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు కారణంగా సీలేరు గ్రామాన్ని నిర్వాసిత గ్రామంగా గుర్తించాలన్న డిమాండ్పై ఉన్నతాధికారులు స్పందించారు. స్థానిక జేఏసీ నాయకులు, ప్రజల విజ్ఞప్తి మేరకుకలెక్టర్, సబ్ కలెక్టర్ ఆదేశాలతో బుధవారం నుంచి గ్రామంలో రెవెన్యూ సిబ్బంది సమగ్ర సర్వేను ప్రారంభించారు.గతంలో నిర్వహించిన పబ్లిక్ హియరింగ్లో సీలేరును నిర్వాసిత గ్రామంగా గుర్తించి, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని జేఏసీ నేతలు, ప్రజాప్రతినిధులు కోరారు. దీనిపై స్పందించిన జాయింట్ కలెక్టర్.. ప్రజల విద్యా, వృత్తి నైపుణ్యాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మొదట ఈ సర్వే నామమాత్రంగా సాగుతోందని జేఏసీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, తహసీల్దార్ అన్నాజీరావు వెంటనే స్పందించారు. తూతూమంత్రం’గా కాకుండా ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలని సిబ్బందిని ఆదేశించారు. వీఆర్వో దేవదానం, సర్వేయర్ మురళీకృష్ణ బుధవారం నుంచి ఇంటింటా పర్యటిస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని కలిసి విద్యార్హతలు, వృత్తిపరమైన వివరాలను నమోదు చేస్తున్నారు. సర్వే పూర్తయిన తర్వాత సమగ్ర నివేదికను జాయింట్ కలెక్టర్కు అందజేస్తామని తహసీల్దార్ తెలిపారు. సర్వే వేగంగా పూర్తి కావడానికి గ్రామ ప్రజలందరూ రెవెన్యూ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.
నిర్వాసితుల గుర్తింపుపై రెవెన్యూ కసరత్తు


