● మౌలిక సదుపాయాలు కల్పించకుంటే ఆందోళన చేస్తాం
● సీపీఎం హెచ్చరిక
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉందని సీపీఎం మండల కార్యదర్శి కొర్రా త్రినాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సీపీఎం నాయకులు స్థానిక ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చుని రోగులు పడుతున్న ఇబ్బందులను చూసి వారు ఆవేదన చెందారు. ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులు ఉండగా, ఒకరు సెలవులో ఉండటంతో ఒక్కరే సేవలందించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది, కానీ తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో వైద్యం కోసం వారు మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సి వస్తోందన్నారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య వ్యవస్థపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నేతలు విమర్శించారు.రోగుల అవస్థలను వివరిస్తూ సీపీఎం నాయకులు కలెక్టర్, ఐటీడీఏ పీవోకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. తక్షణమే పూర్తిస్థాయిలో వైద్యులను, సిబ్బందిని నియమించాలని, మందులు అందుబాటులో ఉంచాలని వారు డిమాండ్ చేశారు.


