● జేసీ తిరుమణి శ్రీపూజ,ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ
పాడేరు రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రలో భాగంగా నిర్వహిస్తున్న జలధార – జల హారతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, పాడేరు ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ పిలుపునిచ్చారు. శనివారం పాడేరు మండలం కిండంగి పంచాయతీ సేరుబయలు పంట చెరువు వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని వారిద్దరూ కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీపూజ మాట్లాడుతూ.. జల సంరక్షణ అనేది కేవలం అధికారుల బాధ్యత మాత్రమే కాదని, అది ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టి సంరక్షించడం ద్వారా భూగర్భ జలమట్టం పెరుగుతుందని వివరించారు.గ్రామాల్లోని చెరువులను పరిరక్షించి, సాగునీరు వృథా కాకుండా చూసుకోవాలని సూచించారు.సాగునీరు సమృద్ధిగా అందుబాటులో ఉన్నప్పుడే వ్యవసాయ రంగం బలోపేతం అవుతుందని, రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటారని ఆమె తెలిపారు. ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతతో పాటు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని కోరారు. ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు గ్రామ స్థాయిలో ఒక ఉద్య మంలా ప్రజలను చైతన్యపరచాలని అధికారులను ఆదేశించారు.గ్రామాల్లో తడి చెత్త, పొడి చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, తద్వారా వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీడీవో తేజరతన్, డిప్యూటీ ఎంపీడీవో రమేష్, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ సిబ్బంది, ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


