సీలేరు: కోర్కెలు తీర్చే కల్పవల్లి, సీలేరు శ్రీ మారె మ్మ అమ్మవారి ఉత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 54వ జాతర మహోత్సవంలో భాగంగా, తమిళ ఉగాదిని పురస్కరించుకు ని తమిళ అర్చకుల ఆధ్వర్యంలో ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. ముందుగా మాలలు ధరించిన మారెమ్మ భవానీలు, స్థానిక మహిళలు మరియు ఆలయ కమిటీ సభ్యులు కలిసి 108 కలశాలతో గ్రామం నుంచి ఆలయం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్నానాల ఘాట్ వద్ద నదిలోని గంగా జలాలను సేకరించి అమ్మవారికి పుణ్యజలాలతో అభిషేకం చేశారు. సాయంత్రం తమిళ అర్చకులు సుబ్రమణ్యం, శ్రీను, ఆలయ అర్చకులు దామోదర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధ్వజస్తంభం వద్ద అమ్మవారి పాదాలకు పంచామృతాలతో అభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించిన అనంతరం, జెండాను ఆవిష్కరించి ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమాలకు విశాఖపట్నానికి చెందిన కె. నాగరాజు, విజయ దంపతులు సహకారం అందించారు. సుమారు 100 మంది భవానీ భక్తులు, గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున ఈ పూజల్లో పాల్గొన్నారు. ఇలావుండగా 54వ మారెమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయంలో అమ్మవారికి పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహించనున్నారు. విద్యుత్ దీపాల అలంకరణలు, బాణాసంచా మెరుపుల మధ్య స్నానాల ఘాట్ వద్ద అమ్మవారి గరగను అలంకరించి, అగ్నిగుండం మీదుగా తీసుకువచ్చి గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు. ఈ వేడుక కోసం ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.


