ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు
అరకులోయటౌన్: నియోజకవర్గ కేంద్రమైన అరకులోయ మండలంతో పాటు డుంబ్రిగుడ మండలంలో బీఎస్ఎన్ఎల్ సేవలు మెరుగు పరచాలని ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన సాక్షితో మాట్లాడారు. అరకులోయ మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పానిరంగిని సమీపంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మెరుగైన ఇంటర్ నెట్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇంటర్నెట్ సేవలు అధ్వానంగా ఉండటం వల్ల విద్యార్థుల ఆన్లైన్ చదువులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు. డుంబ్రిగుడ మండలంలోని కమలబంధ, కరకవలస, కొట్రగొంది, చమండపాడు, కిరికివలస, మొర్రిగుడ, నువ్వగుడ, గొందివలస, టిక్కిలిబెడ్డ పరిసరాల్లో బీఎస్ఎన్ఎల్ టవర్లు ఉన్నప్పటికీ బ్రాడ్బ్యాండ్ సేవలు అందుబాటులో లేకపోవడంతో డిజిటల్ సేవలు, ఆన్లైన్ లావాదేవీలు, విద్య ,ఆరోగ్య సేవల్లో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇప్పటికై నా బీఎస్ఎన్ఎల్ ఉన్నాతాధికారులు స్పందించి ఆయా ప్రాంతాల్లో మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని రవిబాబు డిమాండ్ చేశారు.


