చింతపల్లి: గిరిజన ప్రాంతంలో మంచి ఆదాయాన్ని ఇచ్చే కొత్త పంటల సాగుకు ప్రోత్సాహాన్ని అందిస్తామని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ పి.వి. సత్యనారాయణ తెలిపారు. స్థానిక ప్రాంతీయ వ్యవసాయపరిశోధన స్థానంలో సోమవారం జరిగిన వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహామండలి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.వాతావరణంలో చోటుచేసుకుంటున్న పరిస్థితుల ఆధారంగా పంటలు సాగు చేయాలని సూచించారు. ఈ వార్షిక సంవత్సరంలో గిరిజన రైతులు చేపట్టవలసిన పంటలు,వంగడాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి ప్రణాళికను సిద్ధం చేసినట్టు చెప్పారు. ఎల్నినోపై రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, మరో 15 రోజుల్లో దీని తీవ్రత స్పస్టమవుతుందని తెలిపారు. విశ్యవిద్యాలయం విస్తరణ విభాగం శాస్త్రవేత్త ఎ.వి.రమణ మాట్లాడుతూ జీవవైద్యాన్ని, భూసారాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉందన్నారు. రసాయన,క్రిమిసంహార మందులు వినియోగాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతిలో పంటలు పండించాలన్నారు. రైతు సాధకార సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.బాబూరావు నాయుడు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో మామిడి,జామ, బొప్పాయి,అరటి వంటి పంటల్లో వస్తున్న తెగుళ్ల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. 25–26 వార్షిక సంవత్సరంలో వ్యవసాయ పరిశోధన స్థానం ద్వారా సాధించిన ఫలితాలను ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి వివరించారు. ఆర్ఏఆర్ఎస్ బోర్డు మెంబర్ వండలం బాలయ్య, మాజీ బోర్డు సభ్యుడు దేముడు, ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బయ్యపురెడ్డి,బాలహుస్సేన్రెడ్డి, సందీప్నాయక్ పార్వతీపురం ఏడీఏ రత్నకుమారి, చింతపల్లి ఏడీఏ తిరుమలరావు, సీతంపేట,పాడేరు ఉద్యానవన శాఖ అధికారులు జయశ్రీ ,అనుశ్రీ పలు ఎన్జీవోల సభ్యులు పాల్గొన్నారు.
ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు సత్యనారాయణ


