పెదబయలు: మండలంలోని గంపరాయిపంచాయతీ, అల్లంపుట్టు గ్రామానికి చెందిన తుర్రె సోమన్న (68) మృతదేహం స్థానిక మత్స్యగెడ్డలో లభ్యమైనట్లు ఎస్ఐ టి. వెంకటేష్ తెలిపారు. పోలీసులు, మృతుడి కుమార్తె బాలమ్మి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 9వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో సోమన్న గంపరాయి పంచాయతీ కేంద్రానికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరారు. సాయంత్రమైనా ఆయన తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. రెండు రోజులుగా గాలిస్తున్న క్రమంలో, శనివారం మధ్యాహ్నం గంపరాయి వంతెన సమీపంలోని మత్స్యగెడ్డలో ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుమార్తె బాలమ్మి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతుడి స్వగ్రామం పెదకోడాపల్లి పంచాయతీలోని కుసుమగరువు కాగా, 20 ఏళ్ల క్రితం భార్య మృతి చెందడంతో అల్లంపుట్టులో కుమార్తె వద్దే ఉంటున్నాడు. బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తూ కాలుజారి గెడ్డలో పడి మునిగిపోయి ఉంటారని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. తండ్రి మరణంతో కుమార్తె కన్నీటి పర్యంతమయ్యింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


