పాడేరు రూరల్: పంచాయతీ పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం, పంచాయతీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్. సుందర్రావు విమర్శించారు. శనివారం పాడేరు మేజర్ పంచాయతీ పరిధిలో ఆయన విస్తృతంగా పర్యటించారు. కార్మికులు విధులు నిర్వహిస్తున్న ప్రాంతాలను సందర్శించి, వారిని వేధిస్తున్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికులు అరకొర వేతనాలతో వెట్టిచాకిరీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం అవసరమైన పరికరాలు కూడా అందించకుండా పంచాయతీ పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఎండనక, వాననక ఎంతో కష్టపడి వీధులను శుభ్రం చేస్తూ, చెత్తను తొలగిస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలన్నారు. కార్మికులకు కనీస వేతనం చెల్లించి, వారి ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టెండర్ విధానాన్ని రద్దు చేసి 132, 142 జీవోలను అమలు చేయాలని కోరారు. ప్రతి కార్మికుడికి నెలకు రూ. 21 వేల వేతనం చెల్లించాలని సుందర్రావు డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వంపై సీఐటీయూ నేత
సుందర్రావు విమర్శ


