పాడేరు: మహిళలపై నిస్సిగ్గుగా, సభ్య సమాజం తలదించుకునేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. మహిళా లోకాన్ని కించపరుస్తూ ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, ఆ యనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్ర వారం వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ దీనబంధుకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. అనంతరం విశ్వేశ్వరరాజు విలేకరులతో మాట్లాడారు. ఏబీఎన్లో ‘కొత్త పలుకు’ పేరుతో ప్రసారమైన కథనంలో మహిళల పట్ల అసభ్యకరంగా, చెప్పలేని రీతిలో వ్యాఖ్యలు చేయడం అత్యంత హేయమని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలపై అత్యాచారాలు, హత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు మహిళలను చులకన చేసి మాట్లాడటం దారుణమన్నారు. జర్నలిజాన్ని అడ్డుపెట్టుకొని మహిళలపై అసభ్య దూషణలు, దాడులకు పాల్పడితే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని, మా పార్టీ ఎల్లప్పుడూ మహిళలకు అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాధాకృష్ణ తక్షణమే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, జిల్లా అధికార ప్రతినిధి కూడ సురేష్ కుమార్, జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడు కూడ సుబ్రమణ్యం, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి కూతంగి సూరిబాబు, వైస్ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ, మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు కిల్లో ఊర్వశిరాణి, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, ఎంపీటీసీలు గిడ్డి విజయలక్ష్మి, లకే రామకృష్ణ పాత్రుడు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షురాలు లకే రామసత్యవతి, సీనియర్ నేతలు కిల్లు కోటిబాబు నాయుడు, మినుముల కన్నాపాత్రుడు, మోదా బాబురావు, బూర మహేష్ పాల్గొన్నారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలి
పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు
కేసు నమోదు చేయాలని డిమాండ్
మహిళా లోకాన్ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవేదన


